How to grow mango plant faster in telugu /మామిడి చెట్టు వేగవంతం చేయడం ఎలా?

మామిడి చెట్టు వేగవంతం చేయడం ఎలా?


మొక్కలు నాటటానికి అనువైన కాలం : మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబరు వరకు నాటవచ్చు. మొక్కలు త్వరగా నాటుకొని అభివృద్ధి చెందటానికి తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో జూన్-జూలైలోను, ఎక్కువ వర్షపాతంగల ప్రాంతాల్లో అక్టోబరు - నవంబరు మాసాల్లోను నాటుకోవాలి.

నేలను తయారు చేయటం : వడగాల్పులు, పెనుగాలులు వీచే ప్రాంతాల్లో సరుగుడు, యూకలిప్టస్ మరియు ఎఱ్ఱ చందనం మొదలైనవి గాలులు వీచే దిశలో రెండు వరుసల్లో 2 మీటర్ల ఎడంలో నాటాలి.

నేలను 2 లేక 3 సార్లు బాగా దున్ని, చదును చేసి 1x1x1 మీటర్ల గుంతలు తవ్వాలి. మొక్కల్ని గుంతల్లో నాటటానికి ముందు 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు చెదలు రాకుండుటకుగాను 100 గ్రాముల ఫాలిడాల్ 2 శాతం పొడిని త్రవ్విన మట్టిలో కలిపి గుంతలను నింపి, 7-10 మీటర్ల దూరాన నాటాలి. బాగా సారవంతమైన నేలల్లో 12 మీటర్ల దూరంలో కూడా నాటుకోవచ్చు. మామిడి అంట్ల ఎంపిక : చీడపీడలు ఆశించని వెనీర్ గ్రాఫ్టింగ్ అంట్లను మాత్రమే నాటుకోవాలి. వేరుమూలం మరియు సయాన్ బాగా అతికి ఉండాలి. అంట్లను నాటేటప్పుడు కొత్త చిగుళ్ళు వేరుమూలంపై ఉండరాదు. అంటుకట్టిన భాగం భూమిపై నుంచి 20 సెం.మీ. ఉండి అంటు పైభాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. అంట్లు ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగి ఉండాలి.

మొక్కలు నాటటం : అంటు మొక్కను మట్టిగడ్డతోసహా తీసి వేర్లు కదలకుండా గుంత మధ్యలో నాటి, మట్టితో గట్టిగా నొక్కి, గాలికి పడిపోకుండా చిన్న కొయ్యపాతి కదలకుండా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదులు చేసి నీరు ఇవ్వాలి. తర్వాత 8-10 రోజుల కొకసారి వర్షాలు లేనపుడు నీరు పోసి కనీసం 2 సం||ల వరకు

కాపాడాలి.

ఎరువులు : తక్కువ వర్షపాతం గల ప్రదేశాల్లో ఎరువులను, పోషక పదార్థాలను వర్షాకాలం మొదట్లోను, రెండవ సారి వర్షాకాలం చివరిలోను వెయ్యాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలం చివర్లో వేసుకోవాలి.

తేలికపాటి భూముల్లో తగినంత చెఱువు మట్టిగాని, కంపోస్టు గాని వేయాలి. ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్ నిచ్చే ఎరువులను, తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రా. నత్రజని, భాస్వరం, పొటాష్ పెంచుతూ పదవ సంవత్సరం మరియు ఆ తర్వాత ఒక్కో కిలో నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి (2175 గ్రా.ల యూరియా, 6250 గ్రా. ల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1670 గ్రా.ల మ్యూరేట్ ఆఫ్ పొటాష్). ఫిబ్రవరి చివరి వారంలో లేక మార్చి మొదటి వారంలో పిందె ఏర్పడిన తర్వాత సిఫారసు చేసిన ఎరువుల్లో నాలుగవ భాగం మొక్కకు ఇవ్వడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందడమేగాక తర్వాత సం॥పు కాతకు దోహదపడుతుంది.

నత్రజనిని 50 శాతం పశువుల ఎరువు రూపంలో ఇవ్వాలి. మిగిలిన 50 శాతం రసాయన ఎరువుల రూపంలో అందించాలి. నాలుగు సంవత్సరాల లోపు వయస్సు చెట్లకు సిఫారసు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి వేయాలి. మామిడి కోత అయిన వెంటనే సిఫారసు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా 1/3 భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో (ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో) వేయాలి. కాయలు కోసిన వెంటనే జూన్-జూలై మాసాల్లో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్తో పాటు 10 గ్రాముల యూరియాను మరియు 0.1 మి.లీ. స్టికర్/వెట్టర్ కలిపి పిచికారి చేయటం వలన జింకు లోపాన్ని నివారించవచ్చు.

జింకు లోపం సాధారణంగా చౌడునేలల్లో ఎక్కువగా వస్తుంది. జింకులోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపమున్న ఎడల ఆకులు చిన్నగా మారి సన్నబడి, 

 

పైకి లేదా క్రిందికి ముడుచుకొని పోతాయి. కణుపుల మధ్యదూరం తగ్గిపోయి. ఆకులు గులాబీ రేకుల వలె గుబురుగా తయారవుతాయి (rosette appearance). మొక్కల పెరుగుదల క్షీణించి, కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగబడి తగ్గిపోతుంది.

బోరాన్ లోపంగల చెట్ల ఆకులు కురచబడి, ఆకుకొనలు నొక్కుకు పోయినట్లయి, పెళుసుబారుతాయి. కాయదశలో కాయలు పగుళ్ళు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా. బోరాక్స్ గాని, బోరికామ్లాన్ని గాని భూమిలో వేయాలి. లేదా 0.1 నుండి 0.2 శాతం బోరాక్స్ లేదా బోరికామ్లాన్ని కొత్త చిగురు వచ్చినపుడు ఒకటి లేదా రెండుసార్లు పిచికారి చేయాలి.

ఇనుపధాతులోపం గల చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకులు సైజు తగ్గిపోయి, తీవ్రమయిన లోపం ఉన్న ఎడల మొక్కల ఆకులు పై నుండి క్రిందికి ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనపడుతుంది. దీని నివారణకు 2.5 గ్రా. అన్న బేది + 1 గ్రా. నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయరసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

సాధారణంగా మొక్కల ఎదుగుదల దశలో వివిధ సూక్ష్మపోషక పదార్థాల లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రా. జింక్సల్ఫేట్ + 2.5 గ్రా. పెర్రస్ సల్ఫేట్ + 2 గ్రా. బోరాక్స్ + 2 గ్రా. కాపర్ సల్ఫేట్ + 3 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు జూన్-జూలై, సెప్టెంబర్-అక్టోబర్ మరియు డిసెంబర్-జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్త చిగుర్లు తొడిగినప్పుడు రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయాలి. పత్ర శ్లేషణద్వారా అక్టోబర్ మాసంలో పోషక విలువలను బట్టి పోటాషియం నైట్రేట్ను 10 గ్రా. చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారి చేయాలి.

కలుపు నివారణ, అంతరకృషి : వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమేకాకుండా నేల గుల్లబారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రటాఫ్ ఎకరాకు 800గ్రా., 240 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తరువాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గ్లెసెల్ లేదా రౌండప్ కలుపు మందును లీటరు నీటికి 8 మి.లీ. మందును కలిపి దానితోబాటు 20 గ్రా. అమ్మోనియం సల్ఫేట్గాని, 10 గ్రా. యూరియాగాని కలిపి 20-25 రోజుల కలుపుపై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటప్పుడు చిన్న వయసు పండ్ల మొక్కల మీద పడకుండా జాగ్రత్త వహించాలి (చినీ, నిమ్మ, ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం పండ్లతోటల్లో కూడా ఇదే విధంగా కలుపు నివారించుకోవచ్చు). అంతర పంటలు : లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, ఫాల్సా, బొప్పాయిలాంటి పండ్ల తోటలను మిశ్రమ పంటలుగా వేసుకోవచ్చు, అంటు మొక్కలు ఎదిగే వరకు కాయగూరలు, పెసలు, అలసందలు వంటి అంతర పంటలు వేసుకోవాలి. పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు పైర్లను వేసుకోవచ్చు. నేలను త్వరగా నిస్సారం చేసే మొక్కజొన్న, చెఱకులను, పిండిపురుగు ఎక్కువగా ఆశించే కందిని, జింక్ మరియు పొటాష్ లోపాలను పెంచే నేపియర్ గడ్డిని అంతరపంటలుగా పెంచరాదు.

నీటి యాజమాన్యం : చిన్న మొక్కలకు 6 నెలల వరకు 3 రోజులకోసారి నీరు పెట్టాలి. కాపుకు వచ్చిన చెట్లకు పూత, పిందె దశల్లో నీటి ఎద్దడి రాకుండా నీరు పెట్టాలి. మామిడి తోటలకు కాయ పెరిగే దశలో కనీసం రెండుసార్లు అంటే పిందె ఏర్పడిన తర్వాత 25-30 రోజులకు ఒకసారి, నెలరోజుల తర్వాత మరోసారి నీరు కట్టి, కాయలు కోయటానికి 25-30 రోజుల ముందు నీరు పెట్టటం ఆపివేయాలి. మామిడి కోత తరువాత వెంటనే ఒకసారి నీరుకట్టాలి. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడితే వేరుకుళ్ళు తెగులు ఉధృతిచెంది తోటంతా దెబ్బతింటుంది.

డ్రిప్ నీటిపారుదల పద్ధతి కొత్తగా నాటిన తోటలకు, కాపుకాసే తోటలకు అనుకూలమైనది. ఈ పద్ధతిలో నారు వృధా కాదు కావున మామూలు నీటిపారుదల పద్ధతిలో పారించే విస్తీర్ణం కన్నా 3 లేక 4 రెట్లు ఎక్కువ  విస్తీర్ణాన్ని పారించవచ్చు. ఈ పద్ధతి వలన నీటి వాడకంలో పొదుపు జరిగి, చెట్లు బాగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. చెట్ల పాదుల్లో ఎండుగడ్డి, ఎండిన ఆకులు, వరిపొట్టు, వేరుశనగ పొట్టు లాంటివి వేస్తే భూమిలోని తేమ ఆవిరైపోకుండా సంరక్షింపబడుతుంది. భూమి వేడిని, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయి. వేసిన కొద్దికాలం తర్వాత కుళ్ళి ఎరువుగా మారుతాయి. ప్లాస్టిక్ ను కూడా మల్గా ఉపయోగించవచ్చు.

ఫ్రూనింగ్ మరియు ట్రైనింగ్ (కత్తిరింపులు)

మొక్క క్రింది నుంచి 50 సెం.మీ. వరకు ఎటువంటి కొమ్మలను రానీయకూడదు. ప్రధాన కాండంపై 2 లేదా 3 బలమైన కొమ్మలను ఎన్నుకొని పెరగనివ్వాలి. మిగితావి తీసివేయాలి. పక్కకొమ్మల పొడవు 60-80 సెం.మీ.లు ఉండేలా కత్తిరించుకోవాలి. ఈ విధంగా నిర్ధారించిన ఆకారం వచ్చేవరకు చేయాలి. పెద్దచెట్లలో ప్రతి సంవత్సరం కాయకోత తర్వాత జూన్-జూలై మాసాల్లో అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను, రెమ్మలను తీసివేయుట వలన సూర్యరశ్మి చెట్టంతా బాగా సోకి మంచి కాపునిస్తుంది. కాయ వదిలేసిన తొడిమలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి ఒక్క రెమ్మ చివరి నుండి 3-5 చిగుర్లు వస్తే రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి.

పిందె రాలకుండా తగ్గించటానికి ఒక గ్రాము నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని 10 మి.లీ. మిథనాల్లో కరిగించి తర్వాత 50 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి లేదా 2, 4-డి-10 పి.పి.యమ్. (1 గ్రా. 2, 4-డి పొడిని 100 లీటర్ల నీటిలో కలిపి) ద్రావణాన్ని పిచికారి చేయాలి.

తేనెమంచు పురుగు :

 ఈ పురుగులు రసాన్ని పీల్చటం వలన పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. లేత ఆకులు, కొమ్మల నుండి కూడా రసం పీల్చటంతో ఆకులు ముడుతపడి అంటుకొని సరిగా పెరగవు. పురుగులు విసర్జించిన తేనెలాంటి బంక ఆకుల మీద కారి, సూర్యరశ్మి వెలుతురులో మెరుస్తుంది.

నివారణ : లీటరు నీటికి ఫాస్ఫామిడాన్ 0.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా క్లోరీపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పూత మొదలయ్యే సమయం మరియు పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్ళపైన, కొమ్మలపైన కూడా పిచికారి చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోకముందే పిచికారి చేయాలి. పూత బాగా ఉన్నపుడు పిచికారి చేయడంవలన పుపొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపించిన యెడల కార్బరిల్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. +కార్బండైజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. థయోమిథాక్సామ్ 0.3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయుటవలన పూత మరియు కాపు సమయంతో తేనే మంచు పురుగును సమర్ధవంతంగా నివారించవచ్చు.

కాండం తొలిచే పురుగు : ఇవి ఆశించిన కొమ్మలే కాక ఒక్కసారిగా మొత్తం చెట్టుకూడా ఎండిపోతుంది. పురుగుల విసర్జనాన్ని చూసిగాని, కొమ్మను తట్టినపుడు వచ్చే బోలు శబ్దాన్ని బట్టిగాని వీటి ఉనికిని గమనించవచ్చు. ఈ పురుగు తీవ్రంగా ఆశిస్తే మొక్కలు కూడా చనిపోతాయి.

నివారణ : ఎక్కువ పాడైన కొమమలను తీసివేయాలి. గట్టి ఇనప తీగెను లోపలికి చొప్పించి పురుగులను బయటికి లాగి చంపివేసి, రంధ్రాల్లో మిథైల్ పెరాథియాన్ 50 శాతం ఇ.సి. మందును 1 మిల్లీ లీటరు, లీటరు నీటికి కలిపిన ద్రావణం లేదా పెట్రోలు లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను వేసి బంకమట్టితో మూయాలి.

కాయతొలుచు పురుగు : ఎండుపుల్లో నిద్రావస్థ దశ పూర్తయిన తర్వాత రెక్కల పురుగు వెలువడి కాయల మీద గ్రుడ్లు పెడుతుంది. ఈ పురుగు మామిడి పండ్ల సీజనులో మూడు తరాలు వృద్ధి చెంది మే నెలాఖరుకు నాలుగవ తరంలో ఉన్న ఎదిగిన క్రిమి పురుగులు ఎండు పుల్లల్లోకి చేరి కొన్ని నెలల పాటు నిద్రావస్థలో వుండి ఆ తర్వాత పంటను ఆశిస్తాయి.

నివారణ :

మామిడి పంట పూర్తి అయిన తరువాత ఎండుకొమ్మలను తీసివేసి నాశనం చేయాలి.

పురుగు ఆశించిన కాయలను చెట్టునుండి కోసి నాశనం చేసి పురుగు వ్యాప్తి నివారించాలి.

జనవరి మాసం రెండవ పక్షంలో క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా డైక్లోర్వాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మామిడి పిందెలు గోళీ సైజు లేక గొంగళి పురుగులు వలన వెళ్ళు సమయంలో డైక్లోర్వాస్ 1.5 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా కార్బరిల్ లేదా వేపనూనె 3 మి.లీ. + క్లోరిపైరిఫాస్ 1 మి.లీ. ఒక లీటరు నీరు వంతున కలిపి సాయంత్రం వేళల్లో పిచికరి చేయాలి.

రాతి మంగు : ఇది తామర పురుగుల వల్ల కలుగుతుంది. ఈ కీటకాలు మామిడి కాయలను పిందె దశలో ఆశించి పై చర్మాన్ని గీకడం వల్ల మంగు ఏర్పడుతుంది. ఈ పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ. గాని, కార్బరిల్ 3 గ్రాములు గాని లేదా డైమిథోయేట్ 1.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా హోష్టాథయాన్ 2 మి.లీ. గాని లీటరు నీటికి కలిపి నల్లపూత దశలో అనగా పిందెలు ఎదిగే దశలో పిచికారి చేయాలి.

పిండిపురుగు : వీటి పిల్ల పురుగు లేత గులాబి రంగులో ఉండి వాటి మీద తెల్లని పిండిలాగా ఉంటుంది. భూమిలో కాండం మొదలు దగ్గర పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లపురుగులు చెట్టుపైకి పాకి, లేత కొమ్మలు, కాయలు, తొడిమలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. వీటి నివారణకు తొలకరిలో చెట్టు మొదలు దాకా దగ్గర దగ్గరగా దున్నాలి. లేదా పాదులను తవ్వి తిరగేయాలి. తర్వాత చెట్టు చెట్టూ 2 శాతం మిథైల్ పెరాథియాన్ లేదా ఎండోసల్ఫాన్ పొడి మందులు చల్లి మట్టిలో కలపాలి. వీటి పిల్ల పురుగులు చెట్ల కాండం మీదికి ప్రాకి పైకి పోకుండా శీతాకాలంలో చెట్టు మొదలుకు భూమి నుండి అడుగు ఎత్తులో ఒక అడుగు నిడివిగల పాలిథీన్ షీట్ కాండం చుట్టూ చుట్టి, షీట్పైన గ్రీసుపోయాలి. పిల్ల పురుగులు గ్రీసుపూసిన ప్లాస్టిక్ షీటు అడుగు భాగాన పైకి పోలేక గుంపులుగా గుమికూడతాయి. అప్పుడు వీటిని పదునైన చాకుతో గీకివేసి నాశనం చేయాలి. లేదా లీటరు నీటికి 2 మి.లీ. ఫాస్ఫామిడాన్ లేదా 1 మి.లీ. డైక్లోర్వాస్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి పురుగులపై పిచికారి చేయాలి.

ఆకుజల్లెడ గూడు పురుగు : దీని క్రిములు ఆకుల ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి ఆకుల్ని జల్లెడలాగా జేసి తర్వాత ఆకుల్ని దగ్గరకు జేసి గూడును ఏర్పర్చుకుంటుంది. ఈ పురుగు పూత దశలో పూలను, పూమొగ్గల్ని ఆశించి తరువాత పూగుత్తులని గూడుగా ఏర్పరుస్తుంది.

నివారణ : క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటితో కలిపి జూలై-ఆగష్టు నెలలో పిచికారి చేయాలి.

టెంకపురుగులు : ఈ పురుగులు కాయలు చిన్నగా ఉన్నప్పుడే గ్రుడ్లు పెట్టడం జరుగుతుంది. ఫలితంగా క్రిములు లోనికి చొచ్చుకుపోయి టెంకలోకి ప్రవేశిస్తాయి. ఈ రంధ్రము మూసుకొని పోయి టెంకల లోపల పురుగు ఉన్నట్టు కూడా మనకు తెలియకుండా పోతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే రకాలలో వీటి బెడద ఎక్కువ. 

నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. మందు 1 లీటరు నీటికి లేదా ఫెనిట్రోధియాను 1 మి.లీ. మందు 1 లీటరు నీటిలో కలిపి పిందె పుట్టిన తర్వాత ఒకసారి, నెల తర్వాత మరోసారి పిచికారి చేయాలి. ఇందువల్ల గ్రుడ్లు, వాటి నుండి వచ్చే పిల్లలు చనిపోతాయి. టెంకలో పురుగు దూరిన తర్వాత మందు చల్లినా ప్రయోజనం ఉండదు. రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.

పండుఈగ :  కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువ. లార్వాలు కాయలోని మెత్తని కండను తినటం వలన కాయ మెత్తబడి కుళ్ళి రాలిపోతుంది.

నివారణ : రాలిపోయిన పండ్లను ఏరి నాశనము చేయాలి. చెట్టు క్రింద దున్ని కోశస్థ దశను బయట పడేయాలి. కార్బరిల్ 10% పొడిని భూమిలో (50-100 గ్రా./చెట్టుకు కలుపుట), ప్లాస్టిక్ పళ్ళెంలో మిథైల్ యూజినాల్ (2 మి.లీ.) మరియు 3 గ్రాములు కార్బోఫ్యురాన్ 3 జిని/లీటరు నీటిలో కలిపి తోటలో వేలాడగట్టాలి. 2 మి.లీ. మలాథియాను 1 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు

1. బూడిద తెగులు : ఈ తెగులు ఆకుల మీద, పూరెమ్మల మీద ఆశించినపుడు బూడిద లాంటి తెల్లటి పదార్ధం వ్యాపించి పూత, పిందె రాలిపోతుంది. ఇది పూత కాలంలో కనబడుతుంది.

నివారణ : నీటిలో కరిగే గంధకం 2 గ్రా. లేక కెరాథేన్ 1 మి.లీ. లేక మైకోబ్యూటనిల్ 1 గ్రా. లేక బేలటాన్ 1 గ్రా. వీటిలో ఏదైన ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందును మార్చి పిచికారి చేయాలి.

2. మచ్చతెగులు : మచ్చతెగులు ఆశించినపుడు గోధుమ రంగు మచ్చలు ఆకులు, పండ్లు, పూరెమ్మల మీద ప్రస్ఫుటంగా కనబడతాయి. తెగులు ఉధృతంగా ఉంటే పూరెమ్మలు, పిందెలు రాలిపోయి, పూగుచ్ఛమంతా మగ్గిపోతుంది. కాపు ఉండదు. తెగులు, పండ్లను ఆశించినట్లయితే అవి కుళ్ళిపోతాయి. చిన్న కొమ్మలు ఎండిపోతాయి. గాలిలో తేమ ఎక్కువయినప్పుడు ఇది బాగా వ్యాపిస్తుంది.

నివారణ : ఎండు కొమ్మలను తీసివేసి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి. లీటరు నీటికి 1 గ్రా. కార్బండైజిమ్ కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఎగుమతి చేసే రకాలకు మచ్చతెగులు రాకుండా 15 రోజుల ముందు 1 గ్రా. కార్బండైజిమ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

3. మసి మంగు (సూటీ మోల్డ్) :

లక్షణాలు : ఈ తెగులు కాప్నోడియం అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. రసంపీల్చే తేనె మంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్ధంపై ఆకుల మీద పిందెలు, కాయల మీద నల్లటి మంగులా పెరుగుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ అంతరాయం కలుగుతుంది. కాయసైజు తగ్గిపోయి, రాలిపోతాయి. కాయలు మార్కెట్కి పనికిరాకుండా పోతాయి.

నివారణ :

రసం పీల్చే పురుగులను సమర్ధవంతముగా అరికట్టాలి.

నల్ల మసి మంగు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ చెట్ల ఆకులు, కొమ్మలు, రెమ్మలు తడిచేటట్లు పిచికారి చేయాలి.

• ఆకులపై మసిని తొలగించుటకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని నీటిలో (3-4 లీ॥) కలిపి ఉడికించి, తరువాత మిగతా నీరుపోసి 100 లీటర్ల గంజి ద్రావణం తయారుచేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారి చేయాలి. 4-5 రోజుల తరువాత నీటిని పిచికారి చేస్తే చాలా వరకు మసిమంగ తొలగించబడుతుంది.

కోయటం మరియు నిల్వ చేయటం : మామిడి కాయల్ని నవీన పరికరాల (హార్వెస్టర్ల)ను ఉపయోగించి కోస్తే కాయలకు ఏ విధమైన హాని కలుగకుండా తొడిమలతో సహా కోయవచ్చు. జీడి లేక సొన కారకుండా వుండి కాయలు ఎక్కువ రోజులు నిల్వ వుండి మార్కెట్లో ధర కూడా అధికంగా ఉంటుంది. మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, బెంగుళూరు వారు రూపొందించిన ఐ.ఐ.హెచ్.ఆర్. పరికరం, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ వారు రూపొందించిన ఐ.ఎ.ఆర్.ఐ. పరికరం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఫర్ నార్తన్ ప్లెయిన్స్, లక్నో (యు.పి.) వారు రూపొందించిన సి.ఐ. హెచ్.ఎన్.పి. పరికరం మరియు కొంకణ్ కృషి విద్యాపీఠ్, డాపోలీ వారు రూపొందించిన డాపోలి పరికరం. ఈ డాపోలి పరికరం సహాయంతో కాయల తొడిమను ఈ పరికరం కత్తెరల మధ్య వుంచి లాగినప్పుడు స్ప్రింగువల్ల కత్తెరలు దగ్గరగా వచ్చి తొడిమను కత్తిరిస్తాయి. కాయలు చట్రానిక (ఫ్రేమ్) అమర్చిన వలలో పడతాయి.

పాటుకాయ రాల్తే తెంపడానికి సిద్ధంగా ఉన్నదని అనుకోవాలి. కాయతొడిమకు ఇరువైపుల పాలిపోయిన/ లేత పసుపుపచ్చ రంగురావడం, కాయ ఉపరిభాగాన నూనె గ్రంధులు ఏర్పడటం అనేది కోతకు సరియైనదశ. బంగినపల్లిలో టి.ఎస్.ఎస్. 9.0, దశేరిలో 8.5 వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు. సంచులు తగిలించిన గడలతో కాయల్ని తెంపి, కిందికి చేరవేయాలి. జీడి సొన అంటినప్పుడు పండు పైన చార ఏర్పడుతుంది. జీడి వీలైనంత వరకు అంటకుండా కాయను కొంత సేపటి వరకు బోర్లించి కారనియ్యాలి. కాయలను వరుసలుగా గడ్డిలో పేర్చి మండెవేస్తారు. పూర్తిగా పండే వరకు మండెలను కదల్చరాదు. కాయలు కోసేటపుడు కాయకు ఒక అంగుళం తొడిమ ఉండేటట్లు డాపోలి హార్వెస్టరు నుపయోగించి కోసుకోవాలి.

కాయలను 6 శాతం మైనపు ద్రావణంలో ముంచి తీయడంవల్ల 2-4 రోజులు ఆలస్యంగా పండుతాయి. పండుతున్నప్పుడు బరువును ఎక్కువగా నష్టపోవు. రోగాలను కూడా అరికడుతుంది. నవనీతం లాంటి కొన్ని రకాలు పూర్తిగా పండినా రంగు రాదు, ఆకుపచ్చదనం కొంతమిగిలి ఉంటుంది. ఈ కాయలను 500 పి.పి.ఎం. (500 మి.గ్రా. లీటరు నీటికి) ఏథ్రెల్ లేక ఏథ్లెక్స్లో ముంచి మాటేస్తే రంగు బాగా వస్తుంది. ఈ పండ్లను ఆరు వారాల వరకు 42–45°ఫారన్హీట్ ఉష్ణోగ్రత మరియు 85-90 శాతం గాలిలో తేమ ఉండే శీతల గదిలో ఉంచాలి. నిలకడగా కాపుకాయుటకు చర్యలు : కాయలు కోసేటప్పుడు తొడిమెలతోసహా కోయాలి. కోత పూర్తైన తరువాత ఎండుకొమ్మలను మరియు అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను తీసివేయాలి. చెట్టు చుట్టూ లోతుగా దున్ని, ఎరువులను వేసి వెంటనే నీరుకట్టాలి. జూలై- ఆగష్టు మాసాల్లో మరియు అక్టోబరు మాసంలో లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్, 10 గ్రా. యూరియా కలిపి చెట్టంతా పిచికారి చేయాలి.







Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)